Monday, September 14, 2015

మూడేండ్లలో రెట్టింపైన కుబేరులు

మూడేండ్లలో రెట్టింపైన కుబేరులు
న్యూఢిల్లీ: దేశంలో సంపన్నుల సంఖ్య శరవేగంగా పెరుగుతున్నది. గడిచిన మూడేండ్లలో సూపర్ రిచ్ లిస్ట్‌లో చేరిన ఇండియన్లు రెట్టింపయ్యారు. షాంఘైకి చెందిన లగ్జరీ పబ్లిషింగ్ కంపెనీ హురన్ తాజాగా విడుదల చేసిన శ్రీమంతుల జాబితా ప్రకారం.. జూలై 2015 చివరినాటికి మన దేశంలో 124 మంది డాలర్ బిలియనీర్లు (బిలియన్ డాలర్లంటే ప్రస్తుత మారకం రేటు ప్రకారం మన కరెన్సీలో రూ.6600 కోట్లు) ఉన్నారు. 2012లో కనీసం బిలియన్ డాలర్ల సంపద ఉన్న ఇండియన్లు 56 మందికాగా.. ఈ ఏడాదిలో ఆ సంఖ్య 120 ఎగువకు చేరుకుంది. 

-124కు చేరిన బిలియనీర్ల సంఖ్య
-296
కు పెరిగిన హై నెట్‌వర్త్ ఇండివిజువల్స్
-
మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న ముకేశ్
-
అత్యంత పిన్న వయస్కులైన
-
భారతీయ శ్రీమంతులుగా ఓలా వ్యవస్థాపకులు

అంతేకాదు హై నెట్‌వర్త్ ఇండివిజువల్స్(హెచ్‌ఎన్‌ఐ) 296 మంది ఉన్నారు. రూ.1600 కోట్ల కంటే అధిక సంపద కలిగిన వారిని ఈ జాబితాలో హెచ్‌ఎన్‌ఐలుగా పరిగణలోకి తీసుకున్నారు. శ్రీమంతుల సంఖ్య పెరిగినప్పటికీ వీరందరి ఆస్తి విలువ మాత్రం వార్షిక ప్రాతిపదికన 7 శాతం తగ్గిందని హురన్ ఇండియా హెడ్ అనస్ రహ్‌మాన్ జునైద్ వెల్లడించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 6 శాతం తగ్గడం ఇందుకు కారణమని ఆయన తెలిపారు. అయితే హెచ్‌ఎన్‌ఐల జాబితాలోని 13 మంది సంపద ఈ ఏడాదికాలంలో రెట్టింపు అయిందన్నారు.

హురన్ సంస్థ భారత కుబేరుల జాబితా విడుదల చేయడం ఇది నాలుగోసారి. ఈ ఏడాదికి విడుదల చేసిన జాబితాలోనూ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీయే అగ్రస్థానంలో నిలిచారు. ఆయన ఆస్తి రూ.1.61 లక్షల కోట్లుగా నమోదైందని, గత ఏడాదితో పోలిస్తే మాత్రం 3 శాతం తగ్గిందని హురన్ తెలిపింది. ఈ రిచ్ లిస్ట్‌లో సన్‌ఫార్మా చీఫ్ దిలీప్ సంఘ్వీ రెండో స్థానంలో, ఎస్‌పీ హిందూజా మూడో స్థానంలో నిలిచారు. గత ఏడాది జాబితాలో ఐదో స్థానంలో నిలిచిన విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ ఈసారి 7వ స్థానానికి పడిపోయారు.

ఆన్‌లైన్ ద్వారా కారు అద్దెకిచ్చే ఓలాక్యాబ్స్ వ్యవస్థాపకులు అంకిత్ భాటి(28 ఏండ్లు), భవిష్ అగర్వాల్ (29 ఏండ్లు).. భారత్‌లోని శ్రీమంతులందరిలోకెల్లా అత్యంత పిన్న వయస్కులని హురన్ వెల్లడించింది. రూ. 2,385 కోట్ల చొప్పున సంపద కలిగిన వీరద్దరికీ లిస్ట్‌లో 238వ స్థానం దక్కింది. ఇక మొత్తం 296మంది హెచ్‌ఎన్‌ఐలలో ఆరుగురు మహిళలకే చోటు లభించింది. రూ.19,179 కోట్ల ఆస్తితో బెన్నెట్ కోల్‌మన్‌కు చెందిన ఇందు జైన్.. ఈ జాబితాలో అత్యంత సంపన్నురాలుగా నిలిచారు. 
rich1

-
వీరి ఆర్జన.. రాకెట్టుకన్నా స్పీడు!
హురన్ కుబేర భారతీయుల జాబితాలోని కొందరి ఆస్తుల విలువ ఏడాదికాలంలో శరవేగంగా వృద్ధి చెందింది. బెంగళూరుకు చెందిన మ్యూసిగ్మా అనే డేటా అనలిటిక్స్ కంపెనీ అధినేత ధీరజ్ రాజారామ్ సంపద ఏడాది కాలంలో 593 శాతం పెరిగి రూ.17,800 కోట్లకు చేరుకుంది. ఇండియా బుల్స్‌కు చెందిన సమీర్ గెహ్లాట్ ఆస్తి 445 శాతం పుంజుకొని రూ.9,800 కోట్లకు ఎగబాకింది. వెల్‌స్పన్‌కు చెందిన బాలక్రిష్ణ గోయెంకా సంపాదన 308 శాతం వృద్ధి చెంది రూ.9,820 కోట్లుగా నమోదైంది. ఇక పీఎన్‌సీ ఇన్వెస్ట్ సంస్థకు చెందిన పీఎన్‌సీ మీనన్ ఆస్తి 279 శాతం పెరిగి రూ. 10,960 కోట్లకు చేరుకుంది. ఇక బ్రిటానియా సంస్థకు చెందిన నస్లీ వాడియా ఆర్జన 277 శాతం ఎగబాకి రూ.29,380 కోట్లుగా నమోదైంది.

No comments:

Post a Comment